అకాల వర్షం.. రైతులను అతలాకుతలం చేసిం ది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఆరుగా లం కష్టపడి పండించిన వరి, మొక్కజొన్నను అమ్ముకునేందుకు మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వర్షార్పణమైంది. నాగర్కర్నూల్, వనపర్తి, మ హబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బిజినేపల్లి మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. బకెట్లు, బిందెలతో గంటల తరబడి స్థానికులు తోడేశారు. అక్కడక్కడ కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యంపై రైతులు కవర్లను కప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల మండలాల్లో రైతు కష్టం వరద పాలైంది. సకాలంలో కొనుగోళ్లు జరగకపోవడంతో ధాన్యం నీటిలో మునిగింది. కళ్ల ముందే ధాన్యం తడిచి వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే రైతులు ఆందోళన చెందారు.
