ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. వారు పెట్టే కొర్రీలను భరించలేక.. ధర తక్కువైనా సరే బయటే అమ్ముకున్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామ రైతులు

వనపర్తి, మే 24 : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. వారు పెట్టే కొర్రీలను భరించలేక.. ధర తక్కువైనా సరే బయటే అమ్ముకున్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామ రైతులు. రామన్పాడ్ డ్యామ్ బ్యాక్ వాటర్ ఆధారంగా ఇక్కడ వరి అధికంగా సాగవుతున్నది. ఎప్పటిలాగే ఈ యాసంగిలో 868 ఎకరాల్లో నాట్లు వేయగా, సుమారు 17,360 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్టు అంచనా. ఈ సీజన్లో ప్రభుత్వ విక్రయాలను పరిశీలిస్తే.. విస్తుపోవాల్సిందే. ఐదారేండ్లుగా ఎప్పుడూ లేనివిధంగా రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించారు.
